రాత్రుళ్ళు జాగ్రత్త…. నగరంలో సంచరిస్తున్న దొంగల ముఠా

రాత్రుళ్ళు జాగ్రత్త.... నగరంలో సంచరిస్తున్న దొంగల ముఠా

పగలంతా నిర్మాణ రంగంలో కూలీలుగా వ్యవహరిస్తూ రాత్రయితే వీలున్నచోట ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్‌ ఎల్బి నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజుల వ్యవధిలో ఈ ముఠా ఆరు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. పోలీసుల కథనం మేరక తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం తుమ్మలనగర్‌కు చెందిన పేరా నర్సింహ , మాదకం రమేష్‌ , రెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుండి జగదీష్‌ , పినపాక గ్రామానికి చెందిన పెడియా సారయ్యలు ఓ ముఠాగా ఏర్పడి చోరీకు పాల్పడుతున్నారు.

గతంలో ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో చోరీలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లారు. రెండు నెలల క్రితం జైలు నుంచి బయటకు వచ్చాక ఎల్బి నగర్ సమీపంలోని భరత్‌నగర్‌లో ఓ గది అద్దెకు తీసుకుని దిగారు. కొన్ని రోజులపాటు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూనే ఆలయాపై దృష్టిసారించారు. ఎన్టీఆర్‌ నగర్‌, మున్సూరాబాద్‌, సాయినగర్‌ పరిధిలోని ఆరు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు.

ఉప్పల్‌లో ఓ బైకు దొంగిలించారు. చోరీ చేసిన బండిపై తిరుగుతున్న వీరిని అనుమానించిన మఫ్టీలో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు వ్యవహారం బయటపడింది. నిందితుల నుంచి రూ.6వేలు, ఓ బైకు, నకిలీ బంగారు పుస్తెలు, హారం స్వాధీనం చేసుకున్నారు.