మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

విశాఖపట్నం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీస్ క్వార్టర్స్‌లోనే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చందక దుర్గా భవాని తన క్వార్టర్స్‌లోనే శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని భర్త సింహాద్రి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. భార్య ఉరికి వేలాడుతూ కనిపించడంతో తాడును కోసి కిందకు దించానని.. అప్పటికే ఆమె మృతి చెందిదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అర్ధరాత్రి నిద్రపోతున్న సమయంలో భవాని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భర్త ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే కానిస్టేబుల్ మరణంపై అనుమానాలు వ్యక్తమవడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.