మిర్యాలగూడ ఘటన చూసి బయటకొచ్చిన మరో కులాంతర ప్రేమ జంట !

Love Marriage Couple Approaches Media At Vijayawada

మిర్యాల గూడలో ప్రేమ హత్య కలకలం సృష్టించడంతో ప్రణయ్, అమృత వర్షిణి మాదిరిగానే కులాంతర వివాహం చేసుకున్న మరో జంట, ఇప్పుడు తమకు ప్రాణహాని ఉందని మీడియాను పోలీసులను ఆశ్రయించింది. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన సత్యం రెడ్డి, పద్మావతి దంపతుల కుమార్తె శివ దీప్తి రెడ్డి, కడప ప్రాంతంలో లాండ్రీ నడుపుకుంటున్న విజయ్ కుమార్ తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. ఇంట్లో వాళ్ళను ఒప్పించలేని ఈ జంట జూలై 26న కడపలోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. తమ కూతురు పరువు తీసిందన్న ఆగ్రహంతో ఉన్న శివదీప్తి తల్లిదండ్రులు, కొంతకాలంగా దీప్తిని బెదిరిస్తున్నారట.

Love marriage Couple

తమ దగ్గరి బంధువులు చరణ్ రెడ్డి, రవీందర్ రెడ్డి పోలీసు శాఖలో ఐజీ రేంజ్ పదవుల్లో ఉన్నారని, వారంతా తమను ఏమైనా చేస్తారేమో అని భయంగా ఉందని ఆమె మీడియా ముందు చెప్పుకొచ్చింది. వాళ్ల సాయంతో తాము ఎక్కడ ఉంటున్నామన్న విషయాన్ని సెల్ ఫోన్ల ద్వారా ట్రేస్ చేస్తున్నారని ఆరోపించింది. రౌడీ షీటర్లకు డబ్బులిచ్చి తమను చంపాలని చెప్పినట్టుగా అనుమానం ఉందని ఆమె మీడియా ముందు చెప్పింది. తమకు ఎక్కడ అపాయం కలుగుతుందో అర్థం కావడం లేదని అందుకే మీడియా ముందుకు వచ్చామని ఆమె పేర్కొంది. కులం కట్టుబాట్లను దాటి ఒకటైన తాము ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోజు గడపాల్సి వస్తోందని ఇప్పుడు అమృత ఘటన చూసాక తాను కూడా అమృతలా ఒంటరిని అయిపోతానన్న భయం నెలకొనివుందని శివదీప్తి వెల్లడించింది.