ప్రాణం తీసిన ప్రేమ …ఒకరు గోదావరిలో ఇంకొకరు రైలు కింద మృతి

ప్రాణం తీసిన ప్రేమ ...ఒకరు గోదావరిలో ఇంకొకరు రైలు కింద మృతి

వారిద్దరికి కళాశాలలో పరిచయం అయ్యింది. అదికాస్త ప్రేమగా మారింది. ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పి పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో ప్రియుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని జీర్ణించుకోలేని ప్రియురాలు సైతం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. శ్రీరాంపూర్‌కు చెందిన తగరం మణెమ్మ, స్వామి దంపతుల రెండో కూతురు మల్లిక.. రామకృష్ణాపూర్‌లోని అల్లూరిసీతారామరాజునగర్‌కు చెందిన షేరు సంతోష్‌ మంచిర్యాలలోని ఓ కళాశాలలో చేరారు. ఇంటర్‌లోనే పరిచయం ఏర్పడడంతో డిగ్రీలో అది ప్రేమగా మారింది. ఈ విషయం ఇరు కుటుంబాల్లోనూ తెల్సింది.

వారు కూడా పెద్దగా అడ్డు చెప్పలేదని సమాచారం. సంతోష్‌ చదువు మానేసి కొద్దికాలంగా ఇంటివద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆన్ లైన్ గేమ్స్‌ ఆడేవాడని, ఈ నేపథ్యంలో అప్పులు కూడా అయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు మందలించారో.. ఏమోగానీ.. ఈనెల 21న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలుసుకున్న మల్లిక.. అప్పటినుంచే మనస్తాపానికి గురికాగా.. కుటుంబ సభ్యులు పెద్దపల్లిలోని వారి బంధువుల ఇంటికి తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈనెల 25న ఆటోలో తీసుకెళ్తుండగా.. ఇందారం గోదావరి బ్రిడ్జిపైకి చేరుకోగానే ఆటోలోంచి దూకిన మల్లిక(20).. గోదావరిలో దూకింది. 26న రాత్రివరకు మృతదేహాన్ని పోలీసులు బయటకు తీయించారు. ప్రియుడి లేని లోకంలో తాను ఉండలేననే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్సై గంగరాజ్‌గౌడ్‌ తెలిపారు.