రైతు పోరాటంతో మహేష్‌..!

Mahesh25 movie story Based on Farmers Problems

మహేష్‌బాబు ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా, కీలక పాత్రలో అదితి రావు హైందేరి నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో మహేష్‌బాబు చాలా కొత్తగా, ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించని విధంగా మీసాలు మరియు గడ్డంతో కనిపించబోతున్నాడు. ఇప్పటికే డెహ్రాడూన్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే హైదరాబాద్‌ షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారు. ఇక ఈ చిత్రం స్టోరీ లైన్‌ గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌బాబు ఈ చిత్రంలో రైతుల పక్షాన పోరాడే ఒక యువ విద్యార్థి అని తెలుస్తోంది. రైతులు పడుతున్న బాధలు, వారి నుండి సెజ్‌ల పేరుతో భూములు ఎలా లాక్కుంటున్నారు అనే విషయాన్ని ఇందులో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు చేయని విభిన్న పాత్రను మహేష్‌బాబు చేస్తున్నాడు. 25వ చిత్రం అవ్వడంతో ప్రతిష్టాత్మకం మరియు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశాలున్నాయి.