మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్

మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ క్రమంలో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ ఈ వైరస్ వదలడం లేదు. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఖర్గే నమూనాలను బుధవారం అర్టీ- పీసీఆర్ పరీక్ష కోసం పంపగా పాజిటివ్ గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఖర్గే కార్యదర్శి రవీంద్ర గరిమెళ్ళ ఓ ప్రకటనలో తెలిపారు.

ఖర్గే రెండు డోసులు తీసుకున్నారు. అయితే బూస్టర్ డోసు తీసుకునేందుకు అయన అర్హులు కారు. ఎందుకంటే బూస్టర్ డోసు తీసుకోవాలంటే రెండో డోసు నుంచి కనీసం తొమ్మిది నెలల గ్యాప్ అవసరం. ఢిల్లీలోని ఖర్గే కార్యాలయంలోని గరిమెళ్లతో సహా ఐదుగురు సిబ్బందికి కొద్ది రోజుల క్రితం వైరల్ వ్యాధి సోకింది. ప్రస్తుతం వారందరూ హోమ్ ఐసోలేషన్‌లో బాగా కోలుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఖర్గేతో పరిచయం ఉన్నవారు తమ లక్షణాలను గమనించి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తమను తాము పరీక్షించుకోవాలని ఆయన సూచించారు.