చైనాలో మరో కొత్త వైరస్.. హాంటా వైరస్ తో ఒకరు మృతి..

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇదే సమయంలో ప్రజలపై మరొక మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా లాంటి ఈ మహమ్మారిని ఎలా అరికట్టాలని రాత్రింబవళ్ళు కష్టపడుతున్న ప్రపంచానికి మరొక వార్త వణికించేలా చేస్తుంది. చైనాకు చెందిన ఒక వ్యక్తి హాంటా వైరస్  అనే కొత్తరకం కేసుతో మృతి చెందాడు. చైనాలోని యువాన్ ప్రావిన్స్ నుంచి ఓ వ్యక్తి సోమవారం బస్సులో పనికోసం షాండోంగ్ ప్రావిన్స్ కు తిరిగి వెళ్తుండగా అతను మృత్యువాత పడ్డాడు. అతను ప్రయాణించిన అదే బస్సులో ఉన్న మరో 32మందికి కూడా వైరస్ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం అందుతుంది. అయితే అతను హాంటా వైరస్ లక్షణాలతో మృతి చెందినట్లు తెలుస్తోంది.

అసలు హాంటావైరస్ అంటే..  సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకారం.. హాంటవైరస్ ముఖ్యంగా ఎలుకల ద్వారా వ్యాప్తి చెంది.. ప్రజలలో వివిధ రకాల వ్యాధులకు కారణమౌతుంది. హాంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ (హెచ్‌పిఎస్), మూత్రపిండాలకు చెందిన సిండ్రోమ్ (హెచ్‌ఎఫ్‌ఆర్‌ఎస్) కారణంగా రక్తస్రావం జ్వరం వస్తుంది. ఈ వ్యాధి ప్రధానంగా గాలిద్వారా వ్యాప్తి చెందుతుందని.. మూత్రం, మలం, ఎలుకల లాలాజలం వాటి సంబంధాల  ద్వారా  వైరస్ సోకుతుందని తెలుస్తోంది. అలాగే… హాంటావైరస్ లక్షణాలు అంటే.. హెచ్‌పిఎస్ ప్రారంభ లక్షణాలు అలసట, జ్వరం, కండరాల నొప్పులతో పాటు తలనొప్పి, మైకం, చలి, కడుపు సమస్యలుగా తెలుస్తోంది. చికిత్స చేయకపోతే.. ఇది దగ్గు, శ్వాస ఆడకపోవటానికి దారితీసి ప్రాణాంతకమవుతుంది. సిడిసి ప్రకారం.. ఎలుకల ద్వారా ఈ హాంటావైరస్ విస్తరించే అవకాశం మెండుగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.