రైల్వే ట్రాక్‌పై పడుకొని ఆత్మహత్య

రైల్వే ట్రాక్‌పై పడుకొని ఆత్మహత్య

ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై పడుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. పట్టాలపై అటు ఇటు తిరుగుతూ రైలు దగ్గరకు వస్తుండంటంతో ట్రాక్‌పై తలపెట్టి పడుకున్నాడు. రెండు కాళ్లు పట్టాలపై ఉంచిన అతను.. రైలు దగ్గరకు రావడంతో తల తప్ప మిగతా శరీరమంతా పట్టాలపై ఉంచి పడుకున్నాడు. అయితే ట్రైన్‌ను నడుపుతున్న లోకో పైలెట్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని గమనించాడు. వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దీంతో రైలు కొంచెం దూరంలో పట్టాలపైనే ఆగిపోయింది. ఇది గమనించిన ప్లాట్‌ ఫాం వద్ద ఉన్న పోలీసులు వెంటనే అతడి వైపు పరుగెత్తారు.

అతన్ని రక్షించి కుటుంబానికి అప్పజెప్పారు.ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని శివ్డి స్టేషన్‌ సమీపంలో డిసెంబర్‌ 27న చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ ట్విటర్‌లో షేర్‌ చేసింది. మోటార్ మాన్ అద్భుత కార్యం చేశాడని, సకాలంలో అప్రమత్తమై వ్యక్తి ప్రాణాలను కాపాడగలిగాడని పేర్కొంది. ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేసి ఈ పని చేయగలిగాడని పేర్కొంది. మీ ప్రాణం విలువైనది.

ఇంటి వద్ద మీ కోసం ఎవరో ఒకరు వేచి చూస్తు ఉంటారని ట్వీట్ చేసింది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు మోటార్ మాన్‌ చూపిన తెగువను అభినందిస్తున్నారు. ‘ఆ మోటర్‌ మ్యాన్‌ పేరు చెప్పలేదు. దయచేసి రియల్ హీరోల పేర్లు కూడా చెప్పండి. అందుకు వాళ్లు అర్హులు. ఆయుష్యు గట్టిగా ఉండటంతో వెంట్రుక వాసిలో గండం నుంచి తప్పి ప్రాణాలతో బయటపడ్డాడు. లోకో పైలట్‌ కొన్ని క్షణాలు ఆలస్యం చేసినా అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి’ అని కామెంట్‌ చేస్తున్నారు.