సముద్రంలో మునిగి ఇద్దరు మృతి

సముద్రంలో మునిగి ఇద్దరు మృతి

కొత్త సంవత్సరం సందర్భంగా విశాఖ బీచ్‌లో సంతోషంగా గడుపుదామని వచ్చిన రెండు బృందాల్లో విషాదం నెలకొంది. ఆదివారం సముద్రంలో మునిగి ఇద్దరు మృతిచెందగా ఇద్దరు గల్లంతయ్యారు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన మేరకు.. హైదరాబాద్‌ బేగంపేటకు చెందిన బ్యాంకు ఉద్యోగి శివకుమార్‌ , డిగ్రీ విద్యార్థులు శివ , అజిష్‌  సహా ఎనిమిదిమంది స్నేహితులు గతనెల 30న విశాఖ వచ్చారు. ఆదివారం హైదరాబాద్‌ బయలుదేరుతూ ముందుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్‌కే బీచ్‌లో స్నానాలకు దిగారు.

వీరిలో బ్యాంకు ఉద్యోగి శివకుమార్‌ పెద్ద కెరటం రావడంతో కొట్టుకుపోయి మృతిచెందాడు. అతడి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. శివ, అజిష్‌ సముద్రంలో గల్లంతయ్యారు. వారికోసం గాలిస్తున్నారు. ఒడిశా నుంచి వచ్చిన ఒక కుటుంబలోని ఐదుగురు ఆర్‌కేబీచ్‌లో స్నానాలకు దిగారు. వీరిలో సుమిత్ర త్రిపాఠి  సముద్రంలో కొట్టుకుపోతుండగా కమ్యూనిటీగార్డులు రక్షించారు. ఆమెను కేజీహెచ్‌కి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. ఘటనాస్థలాన్ని ఈస్ట్‌ ఏసీపీ హర్షిత, త్రీటౌన్‌ సీఐ కోరాడ రామారావు పరిశీలించారు.