ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్న యువకుడు

ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్న యువకుడు

ట్రాన్స్‌జెండర్‌ను యువకుడు వివాహం చేసుకున్న అరుదైన ఘటన తమిళనాడులో జరిగింది. కల్లకురిచి జిల్లా చింతాద్రిపేట్‌కు చెందిన మనో అనే యువకుడు.. ట్రాన్స్‌జెండర్ మహిళ రియా కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని భావించి ఈ విషయాన్ని పెద్దలకు చెప్పారు. అయితే, ఈ వివాహానికి ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో వారి అనుమతి లేకుండానే పెళ్లిచేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట ఒక్కటయ్యింది.

వధూవరులను ఆశీర్వదించేందుకు తమిళనాడులో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ట్రాన్స్‌జెండర్లు వివాహానికి హాజరయ్యారు. అత్యంత వైభవంగా వివాహం జరిపించారు. అయితే, తమిళనాడులో ఈ తరహా వివాహలు సర్వసాధారణం. కోయంబత్తూర్, తూత్తుకుడి జిల్లాల్లో ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కోయంబత్తూరులో ఓ జంట వివాహం చేసుకోగా.. దానిని రిజిస్ట్రేషన్ చేయడానికి అధికారి నిరాకరించారు. దీంతో ఆ జంట మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని మదురై ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.