రైల్లో నుంచి తోసేసిన తోటి ప్రయాణీకులు

రైల్లో నుంచి తోసేసిన తోటి ప్రయాణీకులు

కరోనా సోకిందంటూ ఈ శాన్య రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అమానుషంగా కదులుతున్న రైల్లో నుంచి తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తోటి ప్రయాణీకుల దాష్టీకానికి గురైన బాధితుడు కనీసం భాష కూడా రాని ప్రాంతంలో రోడ్లపైనే యాచిస్తూ వారం రోజులుగా దుర్భర జీవితం గడుపుతున్నాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన ఓ సామాజిక కార్యకర్త అధికారులకు తెలిసేలా ట్వీట్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

అస్సాంలోని చిరాంగ్ ప్రాంతానికి చెందిన మెపాల్ బసుమటరి అనే వ్యక్తి బెంగళూరులో పనులు కూలీగా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో తన స్వగ్రామానికి వెళ్లేందుకు బెంగళూరులో రైలెక్కాడు. అయితే అతను తరచూ దగ్గుతుండడంతో కరోనా లక్షణాలున్నాయని భావించిన తోటి ప్రయాణికులు దాష్టీకానికి పాల్పడ్డారు. అతనిని ఏపీలోని శ్రీకాకుళం వద్ద రైల్లో నుంచి కిందకి తోసేశారు.

తీవ్రగాయాలపాలైన మెపాల్.. శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌కి చేరుకున్నా ఎవరూ కనీసం సాయం చేయలేదు. అతను కేవలం బోడోలోనే మాట్లాడుతుండడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇంతలో లాక్‌డౌన్ ప్రకటించడంతో రైళ్లు నిలిచిపోయాయి. కనీసం డబ్బులు కూడా లేకపోవడంతో శ్రీకాకుళంలోనే రోడ్లపై యాచిస్తూ బతుకీడుస్తున్నాడు.

అయితే ఈ విషయం తెలంగాణకు చెందిన ఓ సామాజిక కార్యకర్తకి తెలియడంతో ఆమె మెపాల్ సమస్య అధికారుల దృష్టికి తెచ్చేందుకు ఏపీ సీఎంని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనే ఢిల్లీలోనూ చోటుచేసుకుంది. ఈశాన్యా రాష్ట్రానికి చెందిన యువతితో ఓ పోకిరీ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెకు కరోనా ఉందంటూ ముఖంపై ఉమ్మేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.