జంట మరణాలు

జంట మరణాలు

లైంగిక వేధింపుల కారణంగా ఓ ఇంటర్‌ విద్యార్థిని వారం క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఐతే సూసైడ్‌ నోట్‌లో అందుకు కారణమైన వారి పేరును బాలిక ప్రస్తావించలేదు. ఇది జరిగిన ఒక రోజు తర్వాత అదే స్కూల్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు ఉరేసుని ఆహ్మహత్యకు పాల్పడ్డాడు. ఈ జంట మరణాలు స్థానికంగా కలకలం రేపాయి. అసలేంజరిగిందంటే..

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్‌లో ఇంటర్‌ చదువుతున్న విద్యార్ధిని లైంగిక వేధింపుల కారణంగా చనిపోతున్నట్లు తెలుపుతూ సూసైడ్‌ నోట్‌రాసి గతవారం ఆత్మహత్య చేసుకుంది. అంతేకాకుండా తన సూసైడ్ నోట్‌లో ‘లైంగిక వేధింపుల కారణంగా కరూర్‌లో చనిపోయే చివరి అమ్మాయి నేనే కావాలి. నా ఈ నిర్ణయానికి కారణం ఎవరో చెప్పడానికి భయపడుతున్నాను.

నేను ఈ భూమిపై చాలా కాలం జీవించాలని, ఇతరులకు సహాయం చేయాలని అనుకున్నాను. కానీ ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తోంద’ని తెల్పింది. కేసు ఫైల్‌ చేసిన పోలీసులు విచారణలో భాగంగా విద్యార్ధిని చదివే పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రశ్నించారు. అందులో భాగంగా ఐతే అదే స్కూల్‌లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శరవణన్ ను కూడా ప్రశ్నించారు. మ్యాథ్స్ టీచర్‌పై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసు అధికారులు నిర్ధారించారు.

ఐతే ఈ సంఘటన చోటుచేసుకున్న వారం రోజుల తర్వాత గణిత ఉపాధ్యాయుడు శరవణన్ తన సూసైడ్ నోట్‌లో బాలిక మరణంపై విద్యార్థులు తనను ఆటపట్టించడంతో ఇబ్బందిపడ్డానని, బాలిక తన నోట్‌లో ఎవరి పేరు చెప్పనప్పటికీ అతనిపై అనుమానాలు తలెత్తాయని, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

ఈ సంఘనపై ఒక పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. గణిత ఉపాధ్యాయుడి మరణం వెనుక ఉన్న కారణం మాకు ఖచ్చితంగా తెలియరాలేదు. సమగ్ర విచారణ తర్వాత కారణాలు తెలియజేస్తామని అన్నారు.