గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో పూజా హెగ్డే

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో పూజా హెగ్డే

తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల‍్లి సంతోష్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా సాగుతోంది. సామాన్యులు, టాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఎందరో మొక‍్కలు నాటుతున్నారు. పర్యావరణాన్ని రక్షించే మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌లో ఇప్పటికే సినిమా తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు పాల్గొంటున్నారు. తాజాగా హీరోయిన్‌ పూజా హెగ్డే ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రేరణ మొక్కలు నాటి పలువురికి ప్రేరణ కలిగించింది.

ఈ విషయాన్ని జోగినపల్లి సంతోష్‌ ఆయన ట్విటర్‌ వేదికగా తెలిపారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి, కార్యక్రమంలో భాగమైనందుకు పూజా హెగ్డేకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘మంచి భవిష్యత్తు కోసం మీరు చేసిన ఈ గొప్ప కార్యక్రమాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న మీ అభిమానులు కూడా నిర్వహిస్తారని భావిస్తున్నాను’ అని జోగినపల్లి సంతోష్‌ ట్వీటారు. పూజా హెగ్డేకు హీరో సుశాంత్‌ ఈ గ్రీన్‌ ఇండియా సవాల్‌ విసిరారు. ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్‌ చిత్రంలో నటిస్తోంది. అందులో ‘ప్రేరణ’ అనే పాత్రలో అభిమానులను అలరించనుంది.

ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇటీవల స్వతహాగా సవాల్‌ స్వీకరించిన నటి నందితా శ్వేత మొక్కలు నాటారు. అనంతరం ఆమె ఐశ్వర్య రాజేశ్‌, హీరో నిఖిల్, డైరెక్టర్‌ ప్రశాంత్‌కు ఛాలెంజ్‌ విసిరారు. అంతేకాకుండా ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో బాలీవుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌ కూడా పాల్గొని మొక్కలు నాటారు. వారివెంట అక్కినేని నాగ చైతన్య కూడా ఉన్నారు.