70వ వసంతంలోకి అడుగుపెట్టిన మోదీ

70వ వసంతంలోకి అడుగుపెట్టిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని తన పుట్టినరోజును ఎటువంటి హంగూ ఆర్బాటం లేకుండా అత్యంత సాధారణంగా జరుపుకుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు. పుట్టినరోజు నాడు అమ్మ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం లేదా సాధారణ ప్రజానీకంతో గడపడం ఆనవాయితీ. తొలిసారి 2014లో ప్రధాని హోదాలో పుట్టినరోజు నాడు తన మాతృమూర్తి హీరాబెన్‌ను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.

సాధారణ వ్యక్తిలా అక్కడకు చేరుకుని అమ్మతో 15 నిమిషాలు గడిపారు. ఇక, 2015లో 65వ జన్మదినాన్ని పురస్కరించుకుని 1965 వార్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. 2015 నాటికి భారత్-పాక్ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. అదే ఏడాది మోదీ జన్మదినాన్ని స్వచ్ఛ దివస్‌గా ఎన్‌జీఓ సులభ్ ప్రకటించింది.

2016లో 66 వ జన్మదిన వేడుకలు అమ్మ సమక్షంలో ప్రధాని జరుపుకున్నారు. 2017లో 67 జన్మదినం సందర్శంగా సర్దార్ సరోవర్ డ్యాంను ప్రారంభించారు. 2018లో 68వ పుట్టినరోజు నాడు తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసి నియోజకవర్గంలో పర్యటించి, అక్కడ పాఠశాలలోని చిన్నారులతో గడిపారు. 2019లో సర్దార్ సరోవార్ డ్యాంను సందర్శించి, నర్మదా దేవికి పూజలు చేశారు. తల్లి ఆశీర్వదం తీసుకున్నారు.

ఇదిలా ఉండగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 70వ జన్మదినం సందర్భంగా ఈ నెల 14వతేదీ నుంచి 20 వతేదీ వరకు వారం రోజులపాటు సేవా సప్తాహం నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. గురువారం మోదీ జన్మదినోత్సవంలో భాగంగా వారం రోజుల పాటు మొక్కలు నాటాలని నిర్ణయించారు. దీంతోపాటు దేశంలోని ప్రతీ జిల్లాలోనూ 70 ప్రాంతాల్లో 70 రక్తదాన శిబిరాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో నిరుపేదలకు నిత్యావసరాలు అందజేశారు. రక్తదానం సహా పలు ఆరోగ్య సంబంధ శిబిరాలను నిర్వహిస్తున్నారు.

న్యూఢిల్లీలోని ఆదర్శ్‌నగర్లో పాక్ నుంచి వచ్చిన హిందూ శరణార్ధులకు కుట్టుమిషన్లు, ఈ రిక్షాలు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. మోదీ జన్మదిన వేడుకల్లో కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, డాక్టర్ జితేంద్ర సింగ్,ఎంపీ మనోజ్ తివారీలు పాల్గొన్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్ లో మోదీ 70వ జన్మదినం సందర్భంగా బీజేపీ కార్యకర్తలు 70 కిలోల లడ్డూను శివాలయంలో పంపిణీ చేశారు. హిందూ సేన మోదీ జన్మదినోత్సవాన్ని ఢిల్లీలోని శివశక్తిమందిరంలో నిర్వహించింది.