విశాఖ సంఘటన పై మోడీ స్పందన

విశాఖ సంఘటన పై మోడీ స్పందన

ఎల్‌జీ పాలిమర్స్‌లో రసాయన వాయువు లీకేజీ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్ఘటన వివరాలను సీఎం జగన్‌ ప్రధానమంత్రికి వివరించారు. తీసుకున్న సహాయ చర్యలను కూడా ఆయనకు తెలియజేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. తాజా ప్రమాదంపై చర్చించేందుకు జాతీయ విపత్తు నివారణ అధికారులతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. సహాయ చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై సమీక్షిస్తున్నారు.

మరోవైపు గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై కేంద్ర హోమంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నివారణశాఖా అధికారులతో మాట్లాడానని మోదీ తెలిపారు. బాధితులను ఆదుకునేలా వెంటనే సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించినట్లు ప్రధాని పేర్కొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామన్నారు. గ్యాస్‌ లీకేజీ ఘటనలో అస్వస్థకు గురైన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్‌ చేశారు.