కొడుకును హత్య చేసిన కన్నతల్లి

కొడుకును హత్య చేసిన కన్నతల్లి

విశాఖలో దారుణం జరిగింది.. కొడుకును కన్నతల్లి హత్య చేసింది. మధురవాడలోని మారికవలస న్యూకాలనీలో కోట్ల శ్రీను, మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి అనిల్‌తో పాటు కుమార్తె ఉన్నారు. గత కొంతకాలం నుంచి అనిల్‌ చెడు వ్యసనాలకు బానిసై డబ్బులివ్వమని తల్లిదండ్రులను రోజూ వేధిస్తున్నాడు. ప్రతీరోజూ బయట వ్యక్తులతో గొడవపడటంతో పాటు తల్లిదండ్రులపైనా భౌతికదాడులకు దిగుతున్నాడు. అనిల్‌కు ఎన్నిసార్లు నచ్చజెప్పాలని ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.. దీంతో తల్లికి విసుగొచ్చింది.. తీవ్ర నిర్ణయం తీసుకుంది.

కొడుకు వేధింపుల్ని భరించలేని మాధవి.. ఆదివారం అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అనిల్‌ ఛాతీపై తల్లి మాధవి గ్యాస్‌ సిలిండర్‌తో కొట్టి హత్య చేసింది. హత్య గురించి సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మాధవిని అదుపులోకి తీసుకున్నారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కూడా కలకలంరేపింది.