ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన

ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన

పాతగొడవల నేపథ్యంలో మాట్లాడదామని నమ్మకంగా పిలుచుకెళ్లి ప్రత్యర్థిని మట్టుబెట్టిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. మూడు రోజుల అనంతరం వాగు సమీపంలో శవమై కనిపించడం కలకలం రేపింది. అర్ధవీడు మండలం పోతురాజుటూరుకి చెందిన నల్లబోతుల కాశయ్య(34) గొర్రెల కాపరి. గతంలో గ్రామానికి చెందిన మరో వర్గంతో కాశయ్య గొడవపడ్డాడు. ఈ క్రమంలో ప్రత్యర్థులు ఇంటికొచ్చి మాట్లాడదామంటూ పిలుచుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఐదుగురు వ్యక్తులు వచ్చి కాశయ్యను వెంటబెట్టుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంటికి తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల అనంతరం పెద్దవాగు సమీపంలో కాశయ్య శవమై కనిపించాడు. అతని మృతదేహం పడి ఉందన్న సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రత్యర్థులే దారుణంగా చంపేసి వాగు వద్ద పడేసినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం..