పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్త ఆస్తిపై కన్నేసిన అల్లుడు ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఏమీ ఎరగనట్టు శవాన్ని ఇంట్లో పడేసి హైడ్రామాకు తెరతీశాడు. పోలీసులు, పోస్టుమార్టం అంటూ ఇబ్బంది పెడతారని బావమరిదిని నమ్మించి ఖననానికి సిద్ధమవతుండగా కథ అడ్డం తిరిగింది. వీఆర్వోకి అనుమానం వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తాడేపల్లిగూడెంలో జరిగింది.

పట్టణంలోని 8వ వార్డుకి చెందిన షేక్ రఫీ ఉన్నీసా(55)కి ఒక కుమార్తె, ఇద్దరు కొడుకులు. అదే ప్రాంతానికి చెందిన షేక్ ఉస్మాన్ బాషాతో కూతురికి వివాహం జరిపించింది. పెద్దకొడుకు జంగారెడ్డిగూడెంలో ఉంటుండగా.. చిన్నకొడుకుతో కలసి రఫీ ఉన్నీసా నివాసముంటోంది. ఆమె ఇద్దరు కొడుకులు వ్యసనాలకు బానిసలుగా మారడంతో అత్త ఆస్తిపై అల్లుడు కన్నేశాడు. తన ఆస్తి అమ్మి డబ్బులిస్తే తనకి ఇల్లు కట్టించి ఇస్తానని చెబుతుండేవాడు. అయితే అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేయకపోవడంతో కోపం పెంచుకున్నాడు.

తాను చెప్పినట్లు వినడం లేదని అత్తని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. చిన్నకొడుకుని వ్యసనాల నుంచి బయటపడేసేందుకు పసరు మందు ఇప్పిస్తానని చెప్పి అత్తని కారులో ఎక్కించుకుని వెంకట్రామన్నగూడెం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. పసరు మందు తెస్తానని చెప్పి వెళ్లి చీకటి పడే సమయంలో తిరిగొచ్చాడు. ప్లాన్ ప్రకారం స్క్రైడ్రైవర్‌తో ఆమె గొంతు, ఛాతిలో పొడిచాడు. అయినా ఆమె కదులుతుండడంతో మెడకు ఉరి బిగించి దారుణంగా చంపేశాడు.

అనంతరం తనకేమీ తెలియనట్టు హైడ్రామాకు తెరతీశాడు. శవాన్ని రాత్రివేళ తీసుకెళ్లి ఇంట్లో పడేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం తల్లి మృతదేహాన్ని చూసిన చిన్నకొడుకు కంగారుపడి వెంటనే బావ ఉస్మాన్ బాషాకి ఫోన్ చేశాడు. అనుమానాస్పద రీతితో మరణించిందని.. ఈ విషయం పోలీసులకి తెలిస్తే కేసులు, పోస్టుమార్టం అంటూ తిప్పుకుంటారని నమ్మించి ఖననం చేసేందుకు ఒప్పించాడు. ఆమె మృతదేహానికి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం బయటికి పొక్కడంతో కథ అడ్డం తిరిగింది.