ఆస్ట్రేలియాలో భారత సంతతికి అందునా తెలుగు రాష్ట్రానికి చెందిన డాక్టర్ ప్రీతీ రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పలు ప్రశ్నలు మీస్టరీగా మారాయి. సిడ్నీలో డెంటిస్టుగా పనిచేస్తున్న ప్రీతీ రెడ్డిని ఆమె మాజీ ప్రియుడే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే హత్య జరిగి తర్వాతి రోజే అతడు కూడా కారు ప్రమాదంలో మరణించినట్లు వెలుగులోకి రావడం ఈ కేసును ముందుకు తీసుకు వెళ్ళలేని విధంగా ఉంది. ప్రీతీ రెడ్డిని హత్య చేసిన అనంతరం కావాలనే అతడు కారు ప్రమాదంలో మరణించాడేమోననే సందేహాలు తలెత్తుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రీతీ రెడ్డి (32) సిడ్నీలోని గ్లేన్బ్రూక్ డెంటల్ ఆస్పత్రిలో డెంటిస్ట్గా పని చేస్తున్నారు. ప్రీతీ రెడ్డి, హర్షవర్ధన్ అనే వ్యక్తులు కొంతకాలం కిందటి వరకూ ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల కిందట హర్షవర్ధన్కు ప్రీతీ రెడ్డి బ్రేకప్ చెప్పినట్లు సమాచారం. తనను పెళ్లి చేసుకోవాలని ప్రీతీని హర్షవర్ధన్ కోరగా ఆమె తిరస్కరిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల ఆమె మరో వ్యక్తితో తిరుగుతున్నట్లు హర్షవర్ధన్ గుర్తించాడు.
దీంతో ప్రీతీ రెడ్డిపై కోపం పెంచుకున్న హర్షవర్దన్ ఆమెను చంపాలని ఫిక్స్ అయి ఈ హత్య చేసినట్టు సమాచారం. ఆమె సెయింట్ లియోనార్డ్లో ఓ కాన్ఫరెన్స్కు హాజరు కావడానికి వచ్చారు. దీనికే సదరు వ్యక్తి కూడా హాజతయ్యాడు. అయితే ఆదివారం రాత్రి సరదాగా బయటకు వెళ్లిన ప్రీతీ ఆ తర్వాత కనిపించకుండాపోయారు. ప్రీతీ రెడ్డి చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో ఆదివారం ఉదయం 11 గంటలకు ఫోన్లో మాట్లాడింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత 2.15 గంటల సమయంలో సెంట్రల్ సిడ్నీలోని మెక్డొనాల్డ్స్ వద్ద ప్రీతీ రెడ్డి ఒంటరిగా ఉన్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.
ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ లేదు. ప్రీతీ రెడ్డి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఆదివారం రాత్రి మార్కెట్ స్ట్రీట్లోని ఓ హోటల్లో ప్రీతీ రెడ్డి మరో వ్యక్తితో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రీతీ రెడ్డి ఆచూకీ కోసం సిడ్నీ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. చివరికి ఆమె తన కారు డిక్కీలోనే ఓ సూట్కేసులో శవమై తేలింది. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో కింగ్స్ఫోర్డ్ ఏరియాలో పార్కు చేసిన కారులో ప్రీతీ రెడ్డి మృతదేహం లభ్యమైంది. ప్రీతీ రెడ్డి శరీరంపై పలు చోట్ల కత్తితో పొడిచిన గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం రాత్రి హోటల్లో ఆమె తన మాజీ ప్రియుడు హర్షవర్ధన్ నార్దేతో కలిసి ఉన్నట్లు తెలిసింది. ప్రీతీని అతడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మాట్లాడాలని చెప్పి ఆమెను హోటల్కు పిలిపించి హత్య చేసినట్లు డిటెక్టివ్లు అనుమానిస్తున్నారు.
ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రీతీ రెడ్డి హత్య అనంతరం హర్షవర్ధన్ తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో తన బీఎండబ్ల్యూ కారును ట్రక్కుకు ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు. ప్రీతీ రెడ్డి, హర్షవర్ధన్ చివరిసారిగా ఎక్కడెక్కడ తిరిగారు, వారిని ఏయే వ్యక్తులు కలిశారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చివరిసారిగా వారిని చూసిన వారెవరైనా వస్తారా అని దర్యాప్తు అధికారులు ఎదురుచూస్తున్నారు. ప్రీతీ రెడ్డి హత్యోదంతం మిస్టరీ వీడటానికి మరికొంత కాలం పట్టేట్లు కనిపిస్తోంది.