నగరానికేమైంది.. ? గంట వ్యవధిలోనే నాలుగు హత్యలు

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో గంటల వ్యవధిలోనే నాలుగు హత్యలు కలకలం రేపాయి. గోల్కొండ, రెయిన్ బజార్‌, లంగర్‌హౌస్‌లో ఒక్కరోజే నలుగురు దారుణ హత్యకు గురికావడంతో నగరం ఉలిక్కిపడింది. గోల్కొండ పీఎస్ పరిధిలో రాహుల్‌ అనే వ్యక్తిని తోటి స్నేహితుడే చంపేశాడు. బండరాయితో కొట్టి దారుణంగా చంపేశాడు.

అసలేం జరిగింది అంటే… అజార్, రాహుల్‌ మంచి మిత్రులు. ఇద్దరు కలసిమెలసి తిరిగేవాళ్లు. అబ్దులాపూర్‌లో ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఇదే టైమ్‌లో రాహుల్‌ హత్యకు గురయ్యాడు. తన సోదరి గురించి అసభ్యకరంగా మాట్లాడడం వల్లే… అజార్.. రాహుల్‌ని చంపేసినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. అలాగే.. రెయిన్ బజార్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇలా వరుస హత్యల షాక్ నుంచి తేరుకోకముందే… లంగర్‌హౌస్‌లో నడిరోడ్డుపైనే రౌడీమూకలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో… రౌడీషీటర్లు చాందీ, అబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరే హత్యకు దారితీసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇన్ని ఒకేరోజు అదీ గంటల వ్యవధిలోనే జరగడంతో అసలు నగరానికి ఏమైంది అని ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు.