మైత్రి వారి మాస్టర్‌ ప్లాన్‌

mythri movie makers master plans

తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో కొత్త నిర్మాతలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రం అలా ఉండి పోతాయి. కొన్ని మాత్రం కొన్నాళ్లు సందడి చేసి ఆ తర్వాత కనిపించకుండా పోతాయి. అప్పట్లో 14 రీల్స్‌ సంస్థ వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. స్టార్స్‌ కూడా ఆ బ్యానర్‌లో నటించాలని అనుకున్నారు. కాని ఆ బ్యానర్‌ నిర్మాతలు చేసిన తప్పిదాల కారణంగా ప్రస్తుతం సినిమాలు వరుసగా చేయడంలో విఫలం అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మైత్రి మూవీస్‌ వారి ట్రెండ్‌ నడుస్తుంది. శ్రీమంతుడు చిత్రంతో వెలుగులోకి వచ్చిన ఈ నిర్మాణ సంస్థ అంతకు ముందు ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థగా టాలీవుడ్‌లో అందరికి సుపరిచితం.

శ్రీమంతుడు చిత్రంతో నిర్మాణ సంస్థగా మారి, మొదటి సినిమాతోనే నిర్మాతలు భారీ లాభాలను దక్కించుకున్నారు. ఆ తర్వాత కూడా తెలివిగా స్టార్‌ హీరోలు, చిన్న హీరోలతో కమిట్‌మెంట్స్‌ పెట్టుకుంటు, తమకున్న పరిచయాలతో, ఆర్థిక వనరులతో భారీ చిత్రాలను చేస్తున్నారు. ఇటీవలే రామ్‌ చరణ్‌తో ‘రంగస్థలం’ చిత్రం నిర్మించిన మైత్రిమూవీస్‌ నిర్మాతలు ప్రస్తుతం మహేష్‌బాబుతో సినిమాకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో పలు చిత్రాలు నిర్మించేందుకు కూడా వీరు సిద్దం అవుతున్నారు. ఒక వైపు స్టార్‌ హీరోలతో చిత్రాలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తు, చిన్న హీరోలతో తక్కువ బడ్జెట్‌ చిత్రాలను నిర్మిస్తు వీళ్లు సేఫ్‌ గేమ్‌ను ప్లే చేస్తున్నారు. తాజాగా ఈ నిర్మాణ సంస్థలో నటించేందుకు నాగచైతన్య, సాయి ధరమ్‌ తేజ్‌, విజయ్‌ దేవరకొండ, అఖిల్‌, శర్వానంద్‌లు అడ్వాన్స్‌ తీసుకున్నారు. వీరితో ఈ సంవత్సరం మరియు వచ్చే సంవత్సరంలో వరుసగా మైత్రి వారు సినిమాలను నిర్మించబోతున్నారు.