నర్సింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

నర్సింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రోహిణి నర్సింగ్‌ కళాశాల విద్యార్థిని కాందారపు రవళి రెండు రోజులుగా రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచింది. సుబేదారి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం, గోపాల్‌పూర్‌కు చెందిన కాందారపు తిరుపతి, రజిత దంపతుల పెద్ద కూతురు కందారపు రవళి హంటర్‌రోడ్డులోని రోహిణి నర్సింగ్‌ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్‌ మూడో సంవత్సరం చదువుతుంది.

ఈనెల 7న రాత్రి 10.30 గంటల సమయంలో హాస్టల్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి విద్యార్థినులు, యాజమాన్యం రోహిణి ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి 1.30 సమయంలో తుదిశ్వాస విడిచింది. మృతదేహాన్ని ఎంజీఎంకు పంపించి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ తెలిపారు. విచారణ అనంతరం ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.