మహిళా ఎంపీకి నవనీత్ కౌర్‌కు ఊరట

మహిళా ఎంపీకి నవనీత్ కౌర్‌కు ఊరట

నకిలీ కుల ధ్రువీకరణ కేసులో అమరావతి ఎంపీ, నటి నవనీత్ కౌర్‌కు ఊరట లభించింది. ఈ కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం స్టే విధించింది. ఎన్నికల సమయంలో నవనీత్ కౌర్ నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించినట్టు శివసేన నేత, ప్రత్యర్ధి వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు జూన్ 8న తీర్పు వెలువరించింది. ఆమె ఎస్సీ కేటగిరికి చెందిన మహిళ కాదని, కులధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేసి, రూ.2 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పును నవనీత్ కౌర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

ఒకవేళ సుప్రీంకోర్టు గనుక బాంబే హైకోర్టు తీర్పుపై స్టే విధించకపోయింటే నవనీత్‌ ఎంపీ పదవిని వదలుకోవాల్సి వచ్చేది. మహారాష్ట్రలోని అమరావతి ఎస్సీ రిజర్వ్ లోక్‌సభ స్థానం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవనీత్ కౌర్ విజయం సాధించారు. నవనీత్ కౌర్ ఎస్సీ కాదని, ఫోర్జరీ సర్టిఫికెట్‌తో పోటీచేశారని శివసేన నేత, మాజీ ఎంపీ ఆనందరావు అదసూల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆగస్టు 2013లో ఆమెకు జారీచేసిన కులధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కోరారు.

2014 సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చిన నవనీత్ కౌర్.. అప్పట్లో ఎన్సీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. నవనీత్ భర్త రవి రాణా ప్రస్తుతం అమరావతి జిల్లా బద్నేరా ఎమ్మెల్యేగా ఉన్నారు. సుప్రీంకోర్టులో నవనీత్‌కు అనుకూలంగా నిర్ణయం రావడంతో ఇప్పటికిప్పుడు ఎంపీ పదవికి ఎటువంటి ఢోకా ఉండదు.