పశ్చిమ బెంగాల్లోని మాల్దా పట్టణం నుంచి న్యూఢిల్లీకి వెళ్లే న్యూ ఫరక్కా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్లోని హర్చందాపూర్ వద్ద బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో రైలు పట్టాలు తప్పినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ఇంజిన్ సహా ఐదు బోగీలు పట్టాలు తప్పాయని ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారని సమాచారం అందుతోంది. 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు డాక్లర్ల బృందంతో కూడిన మెడికల్ రిలీఫ్ వ్యాన్ లక్నో నుంచి ఘటనా స్థలానికి వెళ్లింది. అలాగే మొఘల్సరాయిలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్లో హెల్ప్లైన్ నంబర్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన మార్గంలో వెళ్లాల్సిన రైళ్లను దారి మళ్లించారు. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలను రైల్వే మంత్రి పియూష్ గోయల్ పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు ఫోన్లు చేసి సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు.