రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో అతని తల్లి సంచలన ఆరోపణలు చేశారు. అమృత తండ్రి మారుతీరావుతో పాటు అమృత తల్లి కూడా కలసి కుట్ర చేసి, తన బిడ్డను చంపించారని ప్రణయ్ తల్లి ప్రేమలత సంచలన ఆరోపణలు చేశారు. హత్యకు రెండు వారాల ముందు నుంచి అమృత వర్షికి ఫోన్ చేయడం ప్రారంభించిన ఆమె తల్లి, మెత్తగా మాట్లాడి, వారి గురించి ఆరా తీశారని ఆరోపించారు. నల్లపూసల గొలుసు చేయించానని, కొత్త బట్టలు పంపుతానని చెబుతూ వారు ఎక్కడికి వెళుతున్నారన్న వివరాలను సేకరించి తన భర్తకు చేరవేసి తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారని ప్రేమలత ఆరోపిస్తున్నారు.
వర్షిణి అంగీకరిస్తే తమ వెంట తీసుకు వెళ్లమని తాము మారుతీరావుకు స్పష్టంగా చెప్పామని కానీ తన కూతురుకు చీమ కూడా కుట్టకుండా చూసుకుని తన కొడుకును దారుణాతి దారుణంగా చంపించాడని ప్రణయ్ తండ్రి బాలస్వామి ఆరోపించారు. ప్రణయ్, అమృత హైస్కూల్ వయసులోనే ప్రేమించుకున్నారని, తనకు విషయం తెలిసి ప్రణయ్ ని పలుమార్లు కొట్టానని ‘‘పెళ్లి చేసుకొని మా ఇంటికి వచ్చి ఇద్దరూ నా కాళ్లపై పడ్డారు. మమ్మల్ని విడదీయవద్దు అంటూ వర్షిణి వేడుకుంది. దీంతో ఆమెకు మాటిచ్చానని ఆ మాటే తన కొడుకు ప్రాణం తీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.