తెలంగాణకు మిడతల దండు ముప్పు

తెలంగాణకు మిడతల దండు ముప్పు

భారత్ లోని పలు రాష్ట్రాల్లోని పంటపొలాలపై మిడతల దండు స్వైర విహారం చేసి తీవ్ర నష్ట కలిగించిన సంగతి తెలిసిందే. ఓ వైపు తెలంగాణకు మిడతల దండు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో…తాజాగా మిడతల సెగ విమానాలకూ తాకింది.

వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం పైలట్లు, ఇంజినీర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. కీలకలమైన ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని డీజీసీఏ సూచించింది. సాధారణంగా మిడతలు తక్కువ ఎత్తులోనే ఎగురుతుంటాయని, కాబట్టి విమానాలకు అత్యంత క్లిష్టమైన దశ అయిన ల్యాండింగ్, టేకాఫ్‌ సమయాల్లో వాటి నుంచి ముప్పు పొంచి ఉందని డీజీసీఏ పేర్కొంది.

విమానం కనుక మిడతల సమూహనం నుంచి వెళ్తే అవి ఇంజిన్‌లోకి, ఎయిర్ కండిషనింగ్ ప్యాక్ ఇన్లెట్‌లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని విమాన సిబ్బంది, పైలట్లను హెచ్చరించింది.

పాకిస్థాన్ నుంచి భారత్ లోకి ప్రవేశించిన మిడతల దండు పంట పొలాలపై స్వైర విహారం చేస్తోంది. చేతికి అందివచ్చిన పంటను నాశనం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్రలోని పంటపొలాలపై విరుచుకుపడ్డ మిడతల దండు…ఇపుడు తెలంగాణలోకి ప్రవేశించింది. మహారాష్ట్ర మీదుగా ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలోకి మిడతలు వచ్చాయి.

కుమురం భీం జిల్లా తిర్యాణీ, సిర్పూర్ నియోజకవర్గంలోని ప్రాణహిత ప్రాంతాల్లో మిడతల దండు తిష్ట వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇవి ఏ క్షణమైనా… కూరగాయలు, పండ్ల తోటలపై దాడి చేసే అవకాశముందని చెబుతున్నారు. వాటిని తరిమి కొట్టేందుకు పిచికారీ చేయాల్సిన రసాయనాలు, పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.