Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్బాబు, కొరటాల శివల కాంబినేషన్లో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 7న భారీ ఎత్తున ఆడియో విడుదల కార్యక్రమంను నిర్వహించబోతున్నారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు అంటూ సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కాని ఎన్టీఆర్ హాజరు విషయమై చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెప్పేస్తున్నారు. ఎన్టీఆర్ రాక సందర్బంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా ఆడియో విడుదల కార్యక్రమ నిర్వాహకులు అనధికారికంగా చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే ఎన్టీఆర్పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఎమ్మెల్యే’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ పాల్గొనేందుకు ఆసక్తి చూపించలేదు. దాంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ల మద్య విభేదాలు అంటూ ప్రచారం చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఆహ్వానిస్తే వెళ్లని ఎన్టీఆర్ ఇప్పుడు మహేష్బాబు భరత్ అను నేను చిత్రం ఆడియోకు ఎలా వెళ్తున్నాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నదమ్ములు అయినంత మాత్రాన ప్రతి సినిమా ఆడియో విడుదలకు వెళ్లాల్సిన అవసరం ఏంటని, ఎందుకు ప్రతి విషాయన్ని రచ్చ చేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివపై ఉన్న అభిమానంతోనే ఎన్టీఆర్ ఈ ఆడియో వేడుకకు వెళ్తున్నట్లుగా కొందరు నందమూరి ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయమై రచ్చ అవసరం లేదని, నందమూరి బ్రదర్స్ మద్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు.