మన్యం పొదల్లో… నాలుగేళ్ల చిన్నారిపై తాత అఘాయిత్యం

విశాఖపట్టణంలో దారుణం చోటుచేసుకుంది. మన్యంలో నాలుగేళ్ల బాలికపై తాత వరుసయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపుతోంది. బాలిక తల్లి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. అయితే విశాఖ మన్యంలోని దారుణం వెనుక అసలు ఏం జరిగింది అంటే… 60 ఏళ్ల వృద్ధుడు మనవరాలి వరుసయ్యే అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఆ ప్రాంతం సమీపంలోని హుకుంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీ గొందివలసకి చెందిన గెడ్డంగి కొండబాబు (60) ఇంటి పక్కనే ఉండే బాలిక(4)ను మిఠాయి కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. ఇంటి వెనుకాలే ఉండే చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.

అయితే కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతుకుతున్న తల్లికి బోరుమని బాలిక ఏడుపు వినిపించింది. దీంతో ఆమె అటువైపునకు వెళ్లి చూడగా తీవ్ర రక్తస్రావంతో కూతురు కనిపించింది. విషయం తెలుసుకున్న తల్లి ఆగ్రహంతో వృద్ధుడిని చితకబాది కుటుంబ సభ్యులకు తెలిపింది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో హుకుంపేట ఎస్సై అప్పలనాయుడు, ఎంపీడీఓ ఇమ్మానుయేలు గొందివలస చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బాలికకు తాత వరుసవుతాడని కుటుంబసభ్యులు వివరించారు.