ప్రపంచమంతటా ఒమిక్రాన్‌ ఉధృతి

ప్రపంచమంతటా ఒమిక్రాన్‌ ఉధృతి

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఉధృతి రోజురోజుకీ ప్రపంచమంతటా వ్యాపిస్తోంది. బ్రిటన్‌, ఇజ్రాయెల్‌తో సహా అనేక దేశాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. ఐతే బ్రిటీష్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారిక లెక్కల ప్రకారం గడచిన 24 గంటల్లో యూకేలో దాదాపు 663 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇజ్రాయెల్‌ దేశంలో 57 శాతం వేగంగా వ్యాపిస్తోంది. దీంతో బ్రిటన్‌లో మహమ్మారి బారీన పడ్డవారి సంఖ్య 1898కి చేరుకోగా, ఇజ్రాయెల్‌లో 35 నుంచి 55 కు చేరింది.

నిపుణుల అంచనా ప్రకారం.. ఇదే విధంగా మహమ్మారి ఉధృతి కొనసాగితే ఈ నెల చివరినాటికి యూకేలో ఒమిక్రాన్‌ కేసులు పది లక్షలకు చేరే అవకాశం ఉంది. మొత్తం కరోనా కేసుల్లో ఒమిక్రాన్‌ కేసులే సగానికి పైగా ఉంటాయని హెచ్చరిస్తోంది. కాగా యూకే జనాభాలో 12 యేళ్లకు పైబడిన 81 శాతం మందికి రెండు డోసుల వాక్సిన్లు వేయడం పూర్తయ్యింది. ఏదిఏమైనప్పటికీ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రోపికల్‌ మెడిసిన్‌ మాత్రం.. వచ్చే యేడాది ఏప్రిల్‌ నాటికి ఒమిక్రాన్‌ కారణంగా 25 వేల నుంచి 75 వేల వరకు మరణాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.

మరోవైపు ఒమిక్రాన్‌ బారీనపడ్డవారిలో అధికశాతం మంది విదేశాల నుంచి వచ్చినవారేనని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 55 మందిలో 36 మంది సౌత్‌ ఆఫ్రికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, యూఎస్‌, యూఏఈ, బెలారస్‌, హంగేరీ, ఇటలీ, నమీబియా నుంచి వచ్చారు. 11 మంది వీరితో కాంటక్ట్‌లో ఉన్నవారు. మిగిలిన 8 మందికి ఎటువంటి కాంటాక్ట్‌ లేకుండానే మహమ్మారి సోకిందని తాజాగా వెల్లడించింది.