ఓ యువకుడు మృతి మరొకరు గల్లంతు

ఓ యువకుడు మృతి మరొకరు గల్లంతు

కృష్ణా జిల్లా నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం ఘాట్‌ వద్ద సోమవారం కృష్ణానదిలో మునిగి ఓ యువకుడు మృతి చెందగా మరొకరు గల్లంతు అయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం ఇద్దరు యువకులు రెడ్‌ మారుతీ వ్యాగనార్‌ కారులో వచ్చి స్నానానికి దిగారు. లోతు ఎక్కువగా ఉంటుందని లోపలకు వెళ్లవద్దని అక్కడున్న వారు హెచ్చరిస్తున్నా వినిపించుకోకుండా నదిలో దిగిన ఆ ఇద్దరూ కొద్ది సేపటికే గల్లంతయ్యారు. ఇరువురిలో పవన్‌కుమార్‌ మృతదేహాన్ని స్థానికులు పడవపై ఘాట్‌ వద్దకు చేర్చారు.

దుర్గాప్రసాద్‌ ఆచూకీ తెలియరాలేదు. మిత్రులైన వీరిరువురూ ప్రముఖ మెడికల్‌ సంస్థ జీఎస్‌కే (గ్లాక్సో) కంపెనీ సేల్స్‌ విభాగంలో పని చేస్తున్నారని, అందులో భాగంగానే మెడికల్‌ షాపులకు వచ్చి.. సరదాగా కాసేపు సేదదీరేందుకు కృష్ణానదిలో దిగి ఉంటారని భావిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి గుంటూరు జిల్లా భట్టిప్రోలుకు చెందిన పరాచి పవన్‌కుమార్‌(26)గా, గల్లంతైన యువకుడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మావూరి దుర్గాప్రసాద్‌(24)గా గుర్తించారు.