రాజకీయ ఎదుగుదల ఓర్వలేకనే వివేకా హత్య !


మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఇంటి దొంగల పనేనని ఆయన సన్నిహితుడు పరమేశ్వర్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి కోసం ప్రాణం ఇచ్చేవాడినే కానీ, ప్రాణం తీసేవాడిని కాదని ఆయన వివరణ ఇచ్చారు. సోమవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. ఇంట్లో వారి హస్తం లేనిదే వివేకా హత్య జరగదని ఆయన అభిప్రాయపడ్డారు.తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరమేశ్వర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు. వివేకానందరెడ్డి ఎదుగుదలను ఓర్వలేకనే ఈ హత్య చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ సీఎం అయితే వివేకానందరెడ్డి రాజకీయంగా మరింత బలపడేవాడని కడప ఎంపీగా వైఎస్ విజయమ్మ, షర్మిల పోటీ చేయాలనే ప్రతిపాదనను కొందరు తప్పుబట్టినట్టుగా వివేకానందరెడ్డి తనకు చెప్పారని ఆయన గుర్తు చేసుకొన్నారు. కొన ఊపిరితో ఉన్న సమయంలోనే వైఎస్ వివేకానందరెడ్డితో లేఖ రాయించి ఉంటారని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. డ్రైవర్ ప్రసాద్ చాలా మంచివాడని ఇంట్లో ఉండే వివేకాను హత్య చేసి ఉంటారని ఆయన ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డిని కడప ఎంపీగా పోటీ చేయాలని వైఎస్ షర్మిల కోరిందన్నారు. అయితే తాను పోటీకి సిద్దంగా లేనని షర్మిల కానీ, విజయమ్మ కానీ పోటీ చేయాలని వివేకానందరెడ్డి సూచించినట్టుగా ఆయన చెబుతున్నారు. వివేకానందరెడ్డిని హత్య చేసేందుకు పకడ్బందీగా ప్లాన్ చేశారని చెప్పారు. ఇంటి తలుపులు పగులగొట్టే సమయంలో మాకు ఫోన్ చేసి ఉండే అవకాశం ఉంది, మరో వైపు తన వద్ద కూడ లైసెన్స్‌డ్ గన్ కూడ ఉందని తలుపులను ముందుగానే తెరిచిపెట్టి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.