ప్రియురాలితో కలిసి ఆత్మహత్య

ప్రియురాలితో కలిసి ఆత్మహత్య

తాను ప్రేమించిన యువతితో కాకుండా మరో యువతితో పెద్దలు వివాహం చేయడంతో యువకుడు తన ప్రియురాలితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో చోటు చేసుకొంది. వివరాల మేరకు… క్రిష్ణగిరి జిల్లా వేపనపల్లి సమీపంలోని కే. కొత్తూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ సురేష్‌(24), బొమ్మరసనపల్లి గ్రామానికి చెందిన బాలరాజ్‌ కూతురు భవాని(18)లు ఏడాదిగా ప్రేమించుకొన్నారు. అయితే సురేష్‌ కుటుంబ సభ్యులు వీరి ప్రేమపై అయిష్టత వ్యక్తం చేస్తూ నాలుగు నెలల క్రితం సురేష్‌కు వేరే మహిళతో పెళ్లి చేశారు.

ఇష్టం లేని పెళ్లి జరగడంతో సురేష్‌ రెండు రోజుల క్రితం తన ప్రేయసితో కలిసి ఇల్లు వదిలి వెళ్లి హోసూరు– క్రిష్ణగిరి జాతీయ రహదారిలోని కుందారపల్లి వద్ద పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు వారిని క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భవానీ మంగళవారం మృతి చెందింది. సురేష్‌ను మెరుగైన చికిత్స కోసం కోలారుకు తరలించగా మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై క్రిష్ణగిరి తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.