బాబు రాజ్యాసభ సీటు ఇస్తానన్నారు…భయం వేస్తోంది : పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన అయన.. విజయవాడలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి పవన్ మాట్లాడారు.. ఈ సందర్బంగా అయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 2012లోనే రాజకీయాలపై మాట్లాడేందుకు చంద్రబాబును కలిశానని. అప్పుడే రాజకీయ పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో 60–70 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబునాయుడుకు చెప్పానన్నారు.

2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే తనకు రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, కానీ తాను మాత్రం ఆ రాజుఅస భ పదవి కోసం కాకుండా నవ్యాంధ్ర అభివృద్ధి కోసం ఓట్లు చీలవద్దని పోటీ చేయలేదని పవన్ అన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి, మరుసటి రోజే రెండు పేపర్లకు లీకులు ఇచ్చి తన ప్రమేయం లేకుండానే బయట అందరికీ తెలిసేలా చేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తనకు టీడీపీపై, చంద్రబాబుపై ఆ రోజే నమ్మకం పోయిందన్నారు. ఆ తర్వాతే తాను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిశానని చెప్పారు.

2014లో తాను నవ్యాంధ్ర కోసం బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చానని చెప్పారు. 2014లోనే అరవై, డెబ్బై సీట్లలో పోటీ చేసి ఉంటే ఇప్పుడు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడే అవకాశముండేదన్నారు. జగన్‌లా తాను అసెంబ్లీని బహిష్కరించకపోయేవాడినని చెప్పారు. అలాగే లోకేష్ ముఖ్యమంత్రి అయితే తనకేమీ అభ్యంతరం లేదుకానీ, రాష్ట్రం ఏమవుతుందోనన్న భయం మాత్రం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. పుట్టుకతోనే ఎవరికీ రాజకీయ అనుభవం ఉండదని చెప్పారు. కిందపడ్డా, పైకి ఎక్కినా చివరకు అధికారం జనసేన పార్టీదే అన్నారు.

తనకు కులపిచ్చి ఉంటే టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చేవాడినని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబు తనపై కులముద్ర వేయాలని చూస్తున్నారని, ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తే చాలదని, రాష్ట్రంలోని నిరుద్యోగులకు కావాలన్నారు. లోకేష్ సీఎం అయితే ఏం జరుగుతుందో తలుచుకుంటేనే భయమేస్తోందన్నారు. జగన్‌ను ఏం అడిగినా సీఎం అయితే చేస్తానని చెబుతారని ఎద్దేవా చేశారు. సమస్య పరిష్కరించాలంటే మీరు ముందు అసెంబ్లీకి రావాలన్నారు. రాజధానికి ఇన్నివేల ఎకరాలు అవసరం లేదన్నారు. పంటలు పండించే భూములు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇవ్వాలా, మూడు పంటలు పండే భూములు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.