సాక్ష్యంను మరీ పెంచేస్తున్నారు… విరిగి పోయేనేమో చూడండి!

Sakshyam movie Pre Release Business

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు ట్రైలర్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. స్టార్‌ హీరోల సినిమా రేంజ్‌లో ఈ చిత్రం ఉండటంతో తప్పకుండా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆధరిస్తారనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఈ సమయంలోనే భారీ ఎత్తున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సిద్దం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 45 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయినట్లుగా సమాచారం అందుతుంది. ఇంత భారీ స్థాయిలో సినిమా అమ్మడు పోవడం అనేది మామూలు విషయం కాదు.

ఇక ఈ చిత్రం అన్ని రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్‌ సంస్థ దక్కించుకుంది. ఇప్పటి వరకు స్టార్‌ హీరోల సినిమాలతో మాత్రమే బిజినెస్‌ చేసిన ఈ సంస్థ మొదటి సారి చిన్న హీరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేతకు ఈ చిత్రం ద్వారా భారీ మొత్తంలో లాభం చేకూరబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకు వెళ్లేలా పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రంను భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో కాస్త ఫలితం అటు ఇటు అయినా కూడా మొత్తం కుదేలవ్వడం ఖాయం. ఇంతగా అంచనాలు పెంచేస్తే, ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయితే కనీసం అయిదు కోట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. మరి చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ విషయాన్ని గుర్తించి పబ్లిసిటీ చేస్తున్నారో లేదంటే ఏం జరిగితే అదే జరుగుతుందన్న ఉద్దేశ్యంతో చేస్తున్నారో తెలియడం లేదు. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలకు సిద్దం అవుతుంది. త్వరలోనే సినిమా విడుదల అవ్వనుంది.