‘పెద్ది’ (Peddi) సినిమాపై చర్చలు మొదలైన తొలినాళ్లలోనే ఎన్నో కథనాలు వినిపించాయి. మొదట ఎన్టీఆర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తారని, ఇది ఒక మల్లయోధుడి జీవితం ఆధారంగా తెరకెక్కుతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత స్క్రిప్ట్లో మార్పులు జరిగి రామ్చరణ్ ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారు. ప్రారంభంలో క్రికెట్ బ్యాక్డ్రాప్లో సినిమా ఉంటుందని అనుకున్నా, తాజాగా విడుదలైన ప్రచార సామాగ్రి చూసిన తర్వాత ఇది మల్లయుద్ధం నేపథ్యంతో కూడిన కథ అని స్పష్టమైంది.
ఈ నేపథ్యంలోనే గతంలో వినిపించిన ‘దంగల్’ పోలికల చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఊరిలోని అమ్మాయిలను మల్లయుద్ధానికి సిద్ధం చేసి, పెద్ద వేదికపై తన గ్రామానికి పేరు తెచ్చే కథాంశం ఉంటుందనే టాక్ అప్పట్లో బాగా హైలైట్ అయింది. అయితే, ‘పెద్ది’ టీమ్ మాత్రం ఆ పోలికలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “‘పెద్ది’ చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు ‘దంగల్’ గుర్తుకు రాకూడదనేదే మా ముందున్న పెద్ద ఛాలెంజ్. అందుకే సెట్ డిజైన్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. ఎక్కడా ఆ సినిమాను పోలిన సెట్స్ ఉండకూడదని ప్రత్యేకంగా చూసుకున్నాం. ప్రేక్షకులకు ఇదివరకే చూసిన ఫీలింగ్ రాకుండా కొత్త ఐడియాలతో పనిచేశాం” అని తెలిపారు.
విలేజ్ బ్యాక్డ్రాప్ ఉండటం వల్ల కొంతమేర పోలికల భావన వచ్చే అవకాశం ఉన్నా, ‘పెద్ది’లో పూర్తిగా కొత్త టోన్ కనిపిస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ ప్రయోగాలు ఎంతవరకు వర్కౌట్ అయ్యాయో థియేటర్లలోనే తేలనుంది.
రామ్చరణ్కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల వరకు ఖర్చైనట్టు టాక్. మే 18న ట్రైలర్ విడుదల కానుండగా, జూన్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
