వాఘా సరిహద్దుకి వేలాది మంది ?

People Gathering for Abhinandan In Wagah Border

రెండ్రోజుల క్రితం పాక్ చేతికి బందీగా చిక్కిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండ్ అభినందన్ నేడు విడుదల కానున్నారు. పాక్ అధికారులు మధ్యాహ్న సమయంలో అభినందన్‌ను వాఘా సరిహద్దు వద్ద భారత సైన్యానికి అప్పగించనున్నారు. దీంతో సరిహద్దుల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఆయనని ఇప్పటికే పాక్ లోని ఇండియన్ హైకమిషన్ కి పాక్ అధికారులు అప్పగిచారు. ఇప్పటికే అభినందన్‌కు ఘనస్వాగతం పలికేందుకు సైనికాధికారులతో పాటు ఆయన తల్లిదండ్రులు, వేలాది జనం వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. అభినందన్‌ను పాక్ సైన్యం అప్పగించగానే ఆయనకు అక్కడే వైద్య పరీక్షలు చేసేలా సైన్యాధికారులు ఏర్పాటు చేశారు. అభినందన్‌ స్వాగత కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కేంద్రాన్ని కోరారు. అభినందన్‌ లాంటి వీరుడిని అహ్వానించే అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు.

అభినందన్ విడుదల పట్ల ఆయన స్వస్థలం చెన్నైలో సంబరాలు అంబరాన్నంటున్నాయి. పాక్‌తో యుద్ధం చేయకుండానే పరోక్ష విజయం సాధించేలా చేసిన అభినందన్ దేశ ప్రతిష్ఠను మరింత పెంచాడంటూ స్వీట్లు పంచుకుంటున్నారు. బుధవారం పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చిన తర్వాత అభినందన్ నడిపిన మిగ్-21 బైసన్ కూడా పీవోకేలో కూలిపోయింది. పారాచ్యూట్ సాయంతో కిందకు దిగిన ఆయన్ని స్థానికులు పట్టుకొని సైన్యానికి అప్పగించారు. అభినందన్ తమకు చిక్కినట్లు పాక్ ఆర్మీ సోషల్‌మీడియా ద్వారా ప్రకటిస్తూ ఆయన్ని విచారిస్తున్న వీడియోలు పోస్ట్ చేసింది. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ వెంటనే అప్పగించాలంటూ భారత ప్రభుత్వం పాక్‌ను డిమాండ్‌ చేసింది. అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి రావడంతో అభినందన్‌ను విడుదల చేసేందుకు పాక్ నిర్ణయించింది. శుక్రవారం అతడిని భారత్‌కు అప్పగించనున్నట్లు పాక్ ప్రధాని గురువారం పార్లమెంటులో ప్రకటించారు.