యజమానిని చంపి తినేసిన పెంపుడు కుక్కలు…వామ్మో !

pet dogs killed owner

మనకి ఇప్పటి దాకా కుక్కలు మనుషులను కరుస్తాయని తెలుసు కానీ మనిషిని పూర్తిగా తినేస్తాయనే సంగతి తేలీదు. అయితే భయానకంగా ఉన్న ఈ ఘటన గురించి చదివితే మీ ఇంట్లో కుక్కలను పెంచాలన్నా భయపడతారు. ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఈ వార్తను పరిశీలిస్తే అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తున్న ఫ్రెడ్డీ మ్యాక్ (57) ఏప్రిల్ నెల నుంచి కనిపించడం లేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు మ్యాక్ ఇంటికి వెళ్లారు. అయితే, మ్యాక్ పెంచుకుంటున్న 18 కుక్కలు వారిని ఇంట్లో అడుగు పెట్టనివ్వలేదు. దీంతో ఆలోచించిన పోలీసులు వాటికి మత్తు మందు ఇచ్చి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే, ఇంట్లో కూడా మ్యాక్ కనిపించలేదు. గదులన్నీ పరిశీలించిన పోలీసులకి ఎండిపోయిన రక్తమరకలు కనపడ్డ్డాయి. మ్యాక్‌ను ఎవరైనా హత్యచేసి ఉంటే అక్కడ శవం ఉండాలి. కానీ అది కనిపించలేదు. దీంతో అతడిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చని లేదా హత్యచేసి శవాన్ని తీసుకెళ్లిపోయి ఉండవచ్చని భావించారు. ఇలా అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు మరోసారి మ్యాక్ ఇంటికి వెళ్లి నిశితంగా పరిశీలించారు. ఇంట్లో కుక్కుల మలవిసర్జనలను పరిశీలనగా చూడగా వెంట్రుకలు, దుస్తులు, ఎముకల ముక్కలు కనిపించాయి. దీంతో పోలీసులు వాటిని డీఎన్‌ఏ పరిశీలనకు పంపించారు. డీఎన్ఏ రిపోర్టు చూసిన పోలీసులు షాకయ్యారు. కుక్కల మలంలో ఉన్నవి మ్యాక్ శరీర భాగాలేనని తెలిసి ఆశ్చర్యపోయారు. చివరికి అవే అతన్ని తినేశాయని నిర్ధారించారు. అనారోగ్యంతో బాధపడుతున్న మ్యాక్ చనిపోయిన తర్వాత కుక్కలు అతన్ని తినేశాయా? లేదా అతన్ని చంపిన తర్వాత తిన్నాయా అనేది తెలియాల్సి ఉంది. కుక్కలు మనిషిని తిన్నా.. పుర్రె, ఇతరాత్ర ఎముకలను వదిలిపెట్టే అవకాశం ఉంది. కానీ.. ఈ కుక్కలు కనీసం రక్తపు మరకలు, అస్థికలు కూడా కనిపించనంతగా మనిషిని తినేయడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మ్యాక్‌ను ఎవరైనా హత్యచేసి వాటికి ఆహారంగా వేశారా అనే కోణంలో ఆలోచించినా చిక్కుముడి వీడటం లేదు. ఎందుకంటే.. ఆ కుక్కలు ఎవరినీ ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చేవి కావని, అతని బంధువులు కూడా లోపలికి వెళ్లాలంటే భయపడేవారని స్థానికులు చెబుతున్నారు. దీంతో పోలీసులు అతడిని కుక్కలే తినేశాయని నిర్ధారించి కేసు మూసివేశారు.