పీఎం మోడీ ఏపీ పర్యటన వాయిదా….అందుకే…!

Pm Narendra Modi Andhra Pradesh Tour May Be Postponed

ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుంటూరులో ఆరో తేదీన బహిరంగసభలో ప్రసంగించాల్సి ఉంది. ఈ మేరకు షెడ్యూల్ కూయా ఖరారయింది. ఏపీ బీజేపీ నేతలు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే హఠాత్తుగా నరేంద్రమోడీ పర్యటన వాయిదా పడే అవకాశం ఉందన్న సమాచారాన్ని బయటకు వదిలాయి బీజేపీ వర్గాలు. ఆరో తేదీన కేరళలో బహిరంగసభ ఉందని అక్కడ్నుంచి గుంటూరు రావడానికి సమయం సరిపోదని చెబుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం మోదీ జనవరి 6న కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పర్యటించాల్సి ఉంది. ముందుగా తిరువనంతపురంలో జరిగే సభలో పాల్గొని అనంతరం గుంటూరు వస్తారు. అయితే కేరళ బీజేపీ సభను మోడీ సభను తిరువనంతపురంలో కాకుండా శబరిమల దగ్గరలోని పట్టణంతిట్టాలో పెట్టాలని కోరుతోందట. అలా మారిస్తే ప్రస్తుతం శబరిమల అంశం కాక మీద ఉంది కాబట్టి తమకు మైలేజ్ వస్తుందని కేరళ బీజేపీ భావిస్తోంది.

మరోపక్క ఏపీ బీజేపీ ఏమో బహిరంగ సభ స్థల మార్పు జరిగితే ఆ సభ ముగిసిన తర్వాత గన్నవరం రావడానికి మోడీకి సమయం సరిపోదని చెబుతున్నారు. అయితే మోడీ పర్యటన మొత్తం హెలికాఫ్టర్లు, విమానాల ద్వారానే సాగుతుంది. మరి ఎక్కడ ఎందుకు ఆలస్యం అవుతుందో బీజేపీ నేతలు చెప్పడం లేదు కానీ కేరళ బహిరంగసభ వేదికను మారిస్తే… మోడీ గుంటూరు రారని మాత్రం చెబుతున్నారు. అయితే ఇక్కడ విశ్లేషకులు చెప్పే విషయాలు పలు అంశాల మీద అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయి. ఏపీకి మోడీ వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని బీజేపీ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. ఎందుకంటే సీఎం హోదాలో పీఎంకు తాను స్వాగతం పలకనని చంద్రబాబు చెప్పడం, మరో పక్క మోడీ వస్తే నిరసన వ్యక్తం చేస్తామని ప్రజాసంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. గతంలో మోడీ తమిళనాడు పర్యటనకు వెళ్లినప్పుడు వారు వ్యక్తం చేసిన నిరసన దేశవ్యాప్తంగా హైలెట్ అయింది. అలాంటి పరిస్థితులు ఏపీలో ఏర్పడితే ఇబ్బందికరం అవుతుందన్న ఉద్దేశంతో మోడీ టూర్‌ను వాయిదా వేసే ఆలోచన చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.