2022 లో సామాన్యులకి చుక్కలే

2022 లో సామాన్యులకి చుక్కలే

2021లో అన్ని ధరలు ఆకాశాన్ని తాకాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డిజీల్‌ ధరలు సెంచరీ దాటేశాయి. ఇంధన ధరల పెంపుతో ఆహార పదార్థాల, ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలు పెంపు సామాన్యుల నెత్తి మీద పడ్డాయి. ఈ ఏడాది అధిక ద్రవ్యోల్భణం సామాన్యులకు ఊపిరి ఆడకుండా చేసింది. 2021లో టోకు ధరల సూచీ ద్రవ్యోల్భణం ప్రతినెల పెరుగుతూనే వచ్చింది. గత నెలలో డబ్ల్యూపీఐ ఏకంగా 14.23 శాతంగా నమోదయ్యింది. గడచిన దశాబ్దకాలంలో ఈ స్థాయి ద్రవ్యోల్భణం ఇదే తొలిసారి. ఇక కొత్త ఏడాది రాబోతుంది. వచ్చే ఏడాదిలో కూడా ఆయా ధరలు మరోసారి ఆకాశాన్ని తాకే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే ఆయా ఆటోమొబైల్‌ దిగ్గజం కంపెనీలు 2022 వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.అధిక ఇన్‌పుట్, లాజిస్టిక్స్ ఖర్చులు అలాగే సరఫరా అంతరాయాలు మార్జిన్‌లను దెబ్బతీస్తున్నందున, భారత్‌లోని దిగ్గజ తయారీ కంపెనీలు, కన్స్యూమర్‌ కంపెనీలు రాబోయే ఏడాదిలో మరోసారి ధరల పెంపును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలు వచ్చే మూడు నెలల్లో ఆయా వస్తువుల ధరలను సుమారు 4-10 శాతం మేర పెంచే అవకాశం ఉంది. గత రెండు త్రైమాసికాల్లో హిందూస్ధాన్‌ యూనీలివర్‌​, డాబర్‌, బ్రిటానియా, మారికో ఇతర ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు సుమారు 5-12 శాతం మేర ధరలను పెంచాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం తగ్గకపోతే, నాల్గవ త్రైమాసికంలో మరో రౌండ్ ధరల పెరుగుదల అనివార్యమని డాబర్ సీఈవో మోహిత్ మల్హోత్రా అన్నారు.

భారత్‌లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీలు ఈ నెలలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు , ఎయిర్ కండీషనర్లపై ఇప్పటికే 3-5 శాతం మేర ధరలను పెంచాయి. అయితే వచ్చే ఏడాది నుంచి మరో సారి ధరలను పెంచే అవకాశం ఉంది. సుమారు 6-10 శాతం మేర హోమ్‌ అప్లియెన్స్‌ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2020 నుంచి వైట్ గూడ్స్ ధరల పెరుగుదల ఇది నాల్గోసారి.

అధిక ఇన్‌పుడ్‌ కాస్ట్‌, చిప్స్‌ కొరత, సప్లై చైయిన్‌ రంగాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ధరలు పెరగనున్నాయి.గార్మెంట్స్, ఫుట్‌వేర్, టెక్స్‌టైల్స్ ప్రొడక్ట్‌లపై 5శాతం నుంచి 12శాతం వరకు జీఎస్‌స్టీను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత‍్తగా వసూలు చేయనున్న జీఎస్టీ జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానుంది. దీంతో బట్టలు, చెప్పులు ఇతర ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి.దేశంలోని వాహన తయారీదారులు 2022 నుంచి వాహనాల ధరల పెంపును తెలపగా, అవి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల భావిస్తున్నారు.

మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, వోక్స్వ్యాగన్, టయోటా కిర్లోస్కర్ మోటార్ , హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ వాహన కంపెనీలు ముడి సరుకుల ధరలు పెరగడంతో ఏడాది పొడవునా అనేక సార్లు ధరలను పెంచాయి. ఈ నెల ప్రారంభంలో మారుతీ సుజుకీ కొత్త సంవత్సరంలో వాహనాల ధరలను మళ్లీ పెంచనున్నట్లు తెలిపింది . ఇది గత సంవత్సరంలో కంపెనీ ధరలను పెంచడం నాల్గవది, 18 నెలల్లో ఆరవది.

ఉత్పాదకతను మెరుగుపరచడానికి కంపెనీలు అంతర్గత చర్యలు తీసుకునప్పటికీ, స్టీల్, రాగి, ప్లాస్టిక్, అల్యూమినియం వంటి ముడి పదార్థాల ధరలలో అపూర్వమైన పెరుగుదల ఉంది. దీంతో వాహనాల పెంపు అనివార్యమైంది. 2022లో సామాన్యులకు మరోసారి గట్టి షాకే తగ్గలనుంది. ఎఫ్‌ఎమ్‌సీజీ, వాహనాలు, ఎలక్ట్రానిక్స్‌ గూడ్స్‌ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది.