ఆస్తి గొడవ.. కన్న కూతురుపైనే.. కత్తులు కర్రలతో దాడి

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో దారుణంలచోటుచేసుకుంది. కన్నకూతురిపైనే ఓ వ్యక్తి బంధువులతో కలిసి విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై దుస్తులు చించేసి పైశాచికంగా ప్రవర్తించాడు. అల్లుడిని కూడా తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటన తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలూకాలోని గోపాలపుర గ్రామంలో తాజాగా జరిగింది. అయితే ఈ ఘటనకు భూవివాదమే కారణమని తెలుస్తోంది.

కాగా తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలూకా గోపాలపుర గ్రామానికి చెందిన భైరప్ప కుమార్తె అమృతకు ఆరేళ్ల క్రితం సునీల్ అనే యువకుడితో పెళ్లైంది. ఆ దంపతులు ఇద్దరూ బెంగళూరులో నివాసముంటున్నారు. మార్చి నెలలో అమృత భర్త సునీల్‌తో కలిసి గోపాలపురలోని పుట్టింటికి వచ్చింది. ఇంతలోనే కరోనా లాక్ డౌన్ అమల్లోకి రావడంతో దంపతులు అక్కడే ఉండిపోయారు. దీంతో భైరప్ప తన పొలంలో మట్టిని తవ్వించి వేరే వారికి అమ్మాడు. ఈ విషయంపై అమృత తండ్రిని ప్రశ్నించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో అమృత న్యాయం కోసం నోవినకెరె పోలీస్‌‌స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా పోలీస్‌‌స్టేషన్‌ నుంచి ఇంటికి వచ్చిన అమృతతో భైరప్ప మళ్లీ గొడవపడ్డాడు. తన అన్నదమ్ములను బంధువులను పిలిపించి కూతురు, అల్లుడిపై కర్రలు, కత్తులతో దాడి చేయించాడు. వారు అమృత దుస్తులు చించేసి అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటనలో ఆమె తల, భుజాలకు గాయాలై తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో సునీల్‌కు కూడా తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఇద్దరిని తిపటూరులోని ఓ అస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. తన తండ్రికి పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని.. తమ ఆస్తినంతా వారికి ధారపోస్తున్నారని.. తాము ప్రశ్నిస్తే దాడికి పాల్పడ్డాడని అమృత పోలీసులకు తెలిపింది. ఇప్పుడు పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.