సైకో ప్రేమికుడు

సైకో ప్రేమికుడు

ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదన్న బాధలో చచ్చిపోవాలనుకున్న ఓ వ్యక్తి.. ఆ బాధ కోపంగా మారి ఆమెను చంపటానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుమేధ్‌ జాధవ్‌ అనే వ్యక్తి తనతో పాటు ఆఫీసులో పనిచేసే అమ్మాయని ప్రేమించాడు. ఈ విషయం ఆమెకు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. అతడికి మందు అలవాటు ఉండటంతో ఆమె నో చెప్పింది. అయినప్పటికి జాధవ్‌ ఆమె వెంటపడటం ఆపలేదు. ఈ నేపథ్యంలో అమ్మాయి కుటుంబసభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో అతడిపై వేధింపుల కేసు పెట్టారు.

దీంతో కొద్దిరోజులు ఆమెను వేధించటం ఆపేశాడు. తర్వాత మళ్లీ తన పంథాను కొనసాగించాడు. శుక్రవారం బాధితురాలు తల్లితో కలిసి ఖార్‌ స్టేషన్‌కు వెళ్లింది. అతడు కూడా అక్కడికి వెళ్లాడు. ఆమె ముందే రైలు కిందపడి చనిపోదామనుకున్నాడు. కానీ, మనసు మార్చుకుని ఆమెనే రైలుకింద తోసేయ్యటానికి ప్రయత్నించాడు. ఆమె తల్లి తన శక్తికి మించి అతడ్ని అడ్డుకుంది. దీంతో ప్రయత్నం మానుకుని జాధవ్‌ అక్కడినుంచి పారిపోయాడు. బాధితురాలు తలకు స్వల్పగాయాలతో బయటపడింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.