దీపిక తనను చాలా ఇ‍బ్బంది పెడుతుందన్న రణ్‌వీర్

దీపిక తనను చాలా ఇ‍బ్బంది పెడుతుందన్న రణ్‌వీర్

లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు ఇండస్ట్రీ జనాలు. కానీ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌, ఫుట్‌బాల్‌ ఆటగాడు సునీల్‌ చెత్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఎలెవన్‌ ఆన్‌ టెన్‌’ కార్యక్రమం ద్వారా అభిమానులతో ముచ్చటించారు. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో సునీల్‌ చెత్రీ ‘బ్యాడ్మింటన్‌లో మీరు ఎప్పుడైనా దీపికను ఓడించారా’ అని రణ్‌వీర్‌ను ప్రశ్నించాడు. అందుకు రణ్‌వీర్‌ తాను ‘త్రీ పాయింట్‌ చాంపియన్’‌ని అని చెప్పుకొచ్చాడు. అంటే 21 పాయింట్స్‌ సెట్‌లో రణ్‌వీర్‌ కేవలం మూడు పాయింట్స్‌ మాత్రమే సాధించానని తెలిపాడు. అంతేకాక బ్యాడ్మింటన్‌ కోర్టులో దీపిక చాలా క్రూరంగా ఉంటుందని.. తనను చాలా ఇ‍బ్బంది పెడుతుందన్నాడు రణ్‌వీర్‌.

అయితే ఇక మీదట తాను బాగా కష్టపడతానని.. కనీసం 10 పాయింట్లు అయినా సాధిస్తానని అభిమానులకు ప్రామిస్‌ చేశాడు రణ్‌వీర్‌. ఈ లైవ్‌ చాట్‌ షోలో దీపికా పదుకొనే కూడా కొన్ని సెకన్ల పాటు కనిపించింది. అనంతరం తన భర్తను ఉద్దేశించి ‘మీ మామగారి అకాడమీలో చేరి శిక్షణ పొందు’ అంటూ కామెంట్‌ చేసింది. దీపిక తండ్రి ప్రకాష్‌ పదుకొనే బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బ్యాడ్మింటన్‌ కోచింగ్‌ సెంటర్‌ స్థాపించి ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దీపిక, రణ్‌వీర్‌ ‘83’ చిత్రంలో కలిసి నటించారు. 1983లో భారతజట్టు మొదటిసారి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన మధుర సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఈ చిత్రానికి కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ పాత్రలో నటించారు రణ్‌వీర్‌ సింగ్‌. అలాగే కపిల్‌దేవ్‌ భార్య రోమీగా నటించారు రణ్‌వీర్‌ సింగ్‌ భార్య దీపికాపదుకోన్‌. ‘83’ సినిమాను తొలుత ఏప్రిల్‌ 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించడానికి చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.