చిన్నారులపై సామూహిక అత్యాచారం

చిన్నారులపై సామూహిక అత్యాచారం

అభం శుభం తెలియని చిన్నారుల చేత వెట్టిచాకిరీ చేయించుకున్నారు. అంతటితో ఆగక, రోజూ పదిమందికి పైగా వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన దారుణ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. పోలీసులు సోమవారం వెల్లడించిన వివరాల మేరకు కోర్కాడు చెరువు సమీపంలో బాతుల పెంపకం ఫాంలో వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు చిన్నారుల చేత వెట్టి చాకిరీ చేయిస్తుంటారు. వీరిలో శివగంగై జిల్లాకు చెందిన ఐదుగురు బాలికలు ఉన్నారు. ఫాంలో పనిపూర్తికాగానే ఈ అయిదుగురిని బయటకు వెళ్లే వీలులేకుండా ఒక గదిలో బంధించి అన్నం పెడుతుంటారు.

ఈ ఐదుగురు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు సమాచారం అందడంతో ఫాంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అయిదుగురు చిన్నారులను రక్షించారు. పుదుచ్చేరి బాలల సంక్షేమ సంఘం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పలు ప్రాంతాలకు చెందిన 10 మంది సామూహిక లైంగిక దాడులకు పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో ఫాం యజమాని సహా ఏడుగురిని అరెస్ట్‌ చేశారు.