ఆఫ్రికాదేశం మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆఫ్రికాదేశం మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆఫ్రికాదేశం మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ మధ్య మాలి, సెగో పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో మంగళవారం లారీ బస్సు ఢీకొన్న ఘటనలో 41 మంది మరణించారు. మరో 33 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అదుపు తప్పిన ట్రక్కు బస్సు మీదికి దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ ప్రాంతమంతా క్షతగాత్రుల రోదనలతో మిన్నంటింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో బాగా షేర్‌ అయ్యాయి.

వస్తువులు మార్కెట్ కార్మికులతో వెళ్తున్న ట్రక్కు, ప్యాసింజర్ బస్సును ఢీకొట్టినట్లు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రక్కు టైర్ పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బస్సు మీదికి దూసుకెళ్లిందని తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించిన చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. కాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఆఫ్రికాలో ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి లక్ష మంది జనాభాకు 26 మరణాలు నమోదవుతున్నాయి.