రమ్మీ, కాసినో కోసం క్యాషియర్.. బ్యాంక్ నుంచి కోటిన్నర కాజేశాడు..

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో బ్యాంక్ ఉద్యోగి పనిచేసే బ్యాంక్ కే కన్నం వేశాడు. భవిష్యత్ అవసరాల కోసం ప్రజలు బ్యాంకులో దాచుకున్న సొమ్మును క్యాషియర్ గుట్టుచప్పుడు కాకుండా కొట్టేశాడు. తాజాగా జిల్లాలోని నూజివీడు  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)లో క్యాషియర్‌గా పనిచేస్తున్న గుండ్ర రవితేజ బ్యాంకులో కస్టమర్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి ఏకంగా రూ.1.56 కోట్లు తన అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే విధంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన గుండ్ర రవితేజ పీఎన్‌బీ నూజివీడు బ్రాంచిలో హెడ్‌ క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఆన్‌లైన్ రమ్మీ, కాసినో గేమ్స్‌కు బానిసైన అతడు రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. తన దగ్గర డబ్బులన్నీ అయిపోవడంతో బ్యాంకులో ప్రజలు దాచుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ముపై అతడి కన్ను పడింది. దీంతో ఎవరికీ తెలియకుండా కస్టమర్ల అకౌంట్లలో నుంచి తన అకౌంట్‌కు రూ.1,56,56,897 నగదును బదిలీ చేసుకున్నాడు. అయితే ఆ సొమ్మంతా రమ్మీ, కాసినో ఆటల కోసం వినియోగించుకున్నాడు. బ్యాంకులో నగదు లెక్కల్లో తేడా రావడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పీఎన్‌బీ విజయవాడ సర్కిల్‌ చీఫ్‌ మేనేజర్‌ ఎం.నాగేశ్వరరావు తాజాగా నూజివీడు బ్రాంచిలో తనిఖీ చేయగా బండారం బయటపడింది. దీంతో బ్యాంకు అధికారులు నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు రవితేజను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.