శభాష్ ఇస్రో.. జాబిల్లి నుంచి భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్

Sabhash ISRO.. Chandrayaan-3 module from Jabilli into Earth orbit
Sabhash ISRO.. Chandrayaan-3 module from Jabilli into Earth orbit

చంద్రయాన్-3ని జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి పంపించి.. ఆ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్​ చరిత్ర లిఖించింది. ఇందుకోసం ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. ఎన్నో ఏళ్లు కష్టపడి తక్కువ బడ్జెట్​తో విజయవంతమైన చంద్రయాన్-3ని ప్రాజెక్టును ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీన నింగిలోకి పంపింది. ‘విక్రమ్​ ల్యాండర్’​, ‘ప్రజ్ఞాన్​ రోవర్‌’ల సాయంతో విజయవంతంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా భారత్​ నిలిచింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ద్వారా చంద్రుడి గురించి ఇస్రో చాలా విషయాలు సేకరించింది.

ఇక ఇప్పుడు చంద్రయాన్​-3 ప్రాజెక్ట్​లో మరో కీలక అడుగు ముందుకు పడింది. తాజాగా ఇస్రో, జాబిల్లి వద్దకు పంపిన ప్రొపల్షన్ మాడ్యూల్‌ను విజయవంతంగా చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేక ప్రయోగమని ఇస్రో శాస్త్రవేత్తలు​ చెప్పారు. చంద్రుడిపై నుంచి నమూనాలు సేకరించే ప్రణాళికలు చేస్తున్నామని.. తాజా ప్రయోగం ఆ మిషన్​కు దోహదపడుతుందని తెలిపారు. నమూనాలను తీసుకొని తిరిగి వచ్చే మిషన్ కోసం వ్యూహాలు రూపొందించేందుకు ప్రొపల్షన్ మాడ్యూల్​లోని అదనపు సమాచారం ఉపయోగపడుతుందని వెల్లడించారు.