Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో..కమలం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్న వేళ ఆ పార్టీ ఎంపీ ఒకరు సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేంతటి మెజారిటీ బీజేపీ సాధించలేదని రాజ్యసభ ఎంపీ సంజయ్ కకడే వ్యాఖ్యానించారు. అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం మెజారిటీ మార్కు సాధించే అవకాశముందని ఆయన జోస్యం చెప్పడం గమనార్హం. ఒకవేళ గుజరాత్ లో అన్ని పార్టీల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వస్తే…అది కేవలం ప్రధాని నరేంద్రమోడీ చలవే అని సంజయ్ కకడే చెప్పుకొచ్చారు.
తాను ఈ మాటలు ఆషామాషీగా చెప్పడం లేదని, ఓ కచ్చితమైన సర్వేద్వారానే ఈ నిర్దారణకు వచ్చానని ఆయన తెలిపారు. ఆరుగురు వ్యక్తుల బృందంతో తాను గుజరాత్ లో సర్వే చేయించానని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ సర్వే చేశారని రైతులు, డ్రైవర్లు, కార్మికులను వాళ్లు ఎక్కువగా కలుసుకున్నారని వివరించారు. ఆ సర్వేను విశ్లేషించినపుడు గుజరాత్ లో బీజేపీ గెలవలేదని అర్ధమైందన్నారు. దీనికి కారణం రెండో విడత ఎన్నికల ప్రచారంలో నేతలెవరూ అభివృద్ధి గురించి కానీ, ఉపాధికల్పన గురించి కానీ, ఈ మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలకనిర్ణయాల ప్రభావం గురించి కానీ మాట్లాడకపోవడమేనని అభిప్రాయపడ్డారు.
నేతలంతా ప్రతిపక్షంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. సంజయ్ వ్యాఖ్యలు జాతీయస్థాయిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. చాణక్య, ఇండియా టుడే, టైమ్స్ నౌతో పాటు పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ గుజరాత్ లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుపొందుతుందని వెల్లడించగా…సంజయ్ కకడే మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. రెండు విడతలగా జరిగిన ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.