దారుణం: తండ్రిని గొడ్డలితో నరికి చంపేసిన కొడుకు..

తెలంగాణలో మరో ఘోరం చోటుచేసుకుంది. మంచిర్యాలలో జరిగిన ఘటన సర్వత్రా కలకలం రేపుతోంది. కుటుంబ కలహాలతో తండ్రిని కొడుకు హత్య చేయడం ఊర్లో పెను విషాదానికి దారి తీసింది. హాజీపూర్ మండలం రాపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన పట్ల పోలీసులు తాజాగా స్పందించారు.

స్థానికంగా తెలుసుకున్న వివరాల మేరకు దుర్గం ప్రసాద్ రాపల్లిలో చర్చిఫాదర్ గా విధులను నిర్వహిస్తూ చర్చి వెనుకాల కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. అదే సమయంలో కుటుంబ కలహాలతో పెద్ద కొడుకు ప్రణవ్ తండ్రిని బుధవారం తెల్లవారుజామున గొడ్డలితో నరికి చంపేడని ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. అలాగే… మృతుడికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారని… సమాచారం తెలుసుకున్న వెంటనే ఎస్ఐ ఘటనా స్థలికి చేరుకొని విచారించారని తెలిపారు.

అదేవిధంగా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని.. ఘటనా స్థలాన్ని మంచిర్యాల ఇన్ చార్జ్ ఏసీపీ నరేందర్ సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారని వివరించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ వివరించారు.