దారుణం: స్కార్ఫ్.. బైక్ టైర్ కు చుట్టుకొని మహిళ దుర్మరణం

తెలంగాణలో ఘోరం జరిగింది. బైక్ పై వెళుతున్న ఓ మహిళ తన ముఖానికి కట్టుకున్న మాస్క్, బండి వెనుక చక్రంలో ఇరుక్కుని కింద పడేయటంతో దుర్మరణం పాలైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ సమీపంలో చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం… విజయవాడ రూరల్ మండల పరిధిలోని పైడూరుపాడుకు చెందిన మాలన్ బీ (45) లాక్ డౌన్ కు ముందు కొత్తగూడెంలో ఉన్న తన అన్నయ్య ఇంటికి వెళ్లింది. ఆపై అక్కడే చిక్కుకుపోయిన ఆమె.. ఇప్పుడు సడలింపులు రావడంతో ఇంటికి తీసుకెళ్లాలని చెప్పింది. దీంతో ఆమె అన్న.. అల్లుడు గపూర్ నందిగామ బయలుదేరాడు. తాను కూడా అక్కడి వరకూ వచ్చి.. ఆ తర్వాత బస్సులో వెళ్తానని చెప్పి బయలుదేరింది.

కాగా మార్గమధ్యంలో తల్లాడ సమీపంలోకి వాహనం వచ్చేసరికి.. మాలన్ బీ ముఖానికి చుట్టుకుని ఉన్న స్కార్ఫ్ ప్రమాదవశాత్తూ.. వెనుక చక్రంలో ఇరుక్కుంది. దీంతో బైక్ అదుపుతప్పి కిందపడటంతో వెనుకు కూర్చున్న మాలన్ బీ తలకు తీవ్రమైన గాయమైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు జరుపుతున్నారు.