కరీంనగర్ షాక్… భూవివాదంతో వృద్ధ దంపతులు దారుణ హత్య

murder

తెలంగాణలోని కరీంనగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కరీంనగర్ జిల్లాలో వృద్ధ దంపతుల దారుణహత్య తీవ్ర కలకలం రేపింది. వీణవంక మండలం కొండపాకలో మాజీ ఎంపీటీసీ పూరెల్ల సుశీల, ఆమె భర్త పోచాలును మంగళవారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపేశారు. సింగరేణిలో ఉద్యోగిగా పనిచేసిన పోచాలు రిటైర్మెంట్ తర్వాత గ్రామంలోనే తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే వీరికి కుమారుడు మల్లిఖార్జున్‌, కూతురు రూప ఉన్నారు. పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసి బాధ్యత తీర్చుకున్న వృద్ధ దంపతులు గ్రామంలో ఉన్న పొలంలో వ్యవసాయం చేస్తూ బ్రతుకు సాగిస్తున్నారు.

అయితే భూమి విషయంలో వీరికి గ్రామంలోని ఓ కుటుంబంతో వివాదాలు నెలకొన్నాయి. దీంతో మంగళవారం పొలంలో పనులు చేసుకుంటున్న పోచాలును ప్రత్యర్థులు కత్తితో గొంతు కోసి చంపేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు పరుగుతీసిన సుశీలను కూడా అతి కిరాతకంగా హత్య చేశారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాల్ని చూస్తే హంతకులు అతి కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా పోచాలు కుటుంబంతో భూవివాదం కొనసాగుతున్న కుటుంబం పరారీలో ఉండటంతో వారి గురించి పోలీసులు గాలిస్తున్నారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.